Aug 30, 2019

Srikaanth

Our Food Should be Our Medicine Dr Khadar vali

మన ఆహారమే మన ఔషధం కావాలి

Our Food Should be Our Medicine Dr Khadar vali

ఈ మాట హిప్పొక్రేట్స్‌ అనే మహానుభావుడు క్రీస్తు పూర్వమే చెప్పారు. సాంకేతికంగా సమాజం ఎంత ‘అభివృద్ధి’ సాధించినా ఇప్పటికీ ఈ భావనే మానవాళి అంతటికీ తలమానికం కావాల్సి ఉంది. ఆహారంలో పెచ్చుమీరిన రసాయనాల అవశేషాలు, పర్యావరణ కాలుష్యం, పాశ్చాత్య జీవనశైలి అంధానుకరణ... తదితర కారణాల నేపథ్యంలో ఇటీవల సంవత్సరాల్లో కేన్సర్, మధుమేహం ఆందోళనకరంగా వ్యాపిస్తున్నాయి. అత్యాధునిక అల్లోపతి వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చినప్పుటికీ.. రోగుల దైనందిన జీవితాలు వ్యధాభరితంగా మారుతున్నాయి. కేన్సర్‌ బారిన పడే వారి సంఖ్యతోపాటు దీని వల్ల ప్రాణాలు కోల్పోతున్న రోగుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉంది.

ఈ దుస్థితి నుంచి బయటపడడానికి ఇంకేదైనా మెరుగైన దారి ఉందా??నిస్సందేహంగా కేన్సర్‌ను జయించే మార్గం ఉందంటున్నారు స్వతంత్ర ఆహార, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ ఖాదర్‌ వలి!  సిరిధాన్యాలను ఆహారంగా తీసుకోవటం, కొన్ని రకాల కషాయాలను తాగటం, జీవనశైలిలో కచ్చితమైన మార్పులు చేసుకోవటం ద్వారా కేన్సర్‌ను విజయవంతంగా ఎదుర్కోవచ్చని డాక్టర్‌ ఖాదర్‌ చెబుతున్నారు. సిరిధాన్యాలు, కషాయాలు, హోమియో/ ఆయుర్వేద మందుల ద్వారా రోగులు సాంత్వన పొందవచ్చని అనుభవపూర్వకంగా సూచిస్తున్నారు. తన వద్ద చికిత్స పొందిన, పొందుతున్న కేన్సర్‌ రోగుల జీవితాల్లో చీకట్లు తొలగి కొత్త ఆశలు చిగురిస్తున్నాయంటున్నారు.

Our Food Should be Our Medicine Dr Khadar Vali
Our Food Should be Our Medicine Dr Khadar Vali

డా.ఖాదర్‌వలి అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...

నాలుగు నెలల క్రితం ఒక యువకుడు తన తల్లితో కలిసి నా దగ్గరకు వచ్చాడు. అతను బయోటెక్నాలజీలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ చదువుకున్నాడు. అతని తల్లి గర్భాశయ కేన్సర్‌తో బాధపడుతోంది. ఆమెకు రేడియేషన్, కీమోథెరపీ ఇచ్చారు. ఆ చికిత్స తర్వాత ఆమె బక్కచిక్కి, బలహీనపడ్డారు. వైద్యులు ఇక చికిత్స చేయలేమని చేతులెత్తేశారు. ఆశలన్నీ ఆవిరైపోయిన తర్వాత చివరి ప్రయత్నంగా కుమారుడిని వెంటబెట్టుకొని ఆమె నా దగ్గరకు వచ్చారు. నేను వెంటనే ఆమె అనారోగ్యం పూర్వాపరాలు అడిగి తెలుసుకున్నాను. ఆమెతో సుదీర్ఘంగా మాట్లాడిన తర్వాత.. పర్వాలేదు, మీరు క్రమంగా కోలుకుంటారని నేను ఆశాభావంతో చెప్పాను. ఇంతకుముందు వైద్యులు ఇచ్చిన మందులను కొనసాగిస్తూనే.. అరికె బియ్యం, సామ బియ్యం వంటి సిరిధాన్యాలను ఆహారంగా తీసుకోవాలని.. రావి ఆకులు, జామ ఆకులతో తయారు చేసిన కషాయాన్ని 3–4 నెలల పాటు తాగాలని సూచించాను. నేను చెప్పిన మాటలపై ఆమె కుమారుడికీ నమ్మకం కుదిరినట్లు అనిపించింది. తల్లి, కొడుకు ఇద్దరూ ఆశాభావంతోనే ఇంటికి తిరిగి వెళ్లారు.

అటువంటి రోగులు చాలా మంది నన్ను కలుసుకుంటూ ఉండటం మామూలే కాబట్టి ఆ తల్లి, కుమారుడి గురించి నేను అప్పట్లోనే మర్చిపోయాను. అయితే, రెండు రోజుల క్రితం వాళ్లిద్దరూ మళ్లీ నన్ను కలవడానికి వచ్చారు. నన్ను చూసీ చూడగానే కుమారుడు నాకు పాదాభివందనం చేశాడు. తల్లి ఆరోగ్యం కుదుటపడుతున్నట్లు అనిపించింది. నేను ఆహారంలో చెప్పిన మార్పులను ఆమె తు.చ. తప్పకుండా పాటించారు. నిజానికి వాళ్లు తమకు అంతకుముందు వైద్యం చేస్తున్న డాక్టర్‌ దగ్గరకు వెళ్లి నేను సూచించిన వైద్యాన్ని గురించి తెలియజేశారు. ఆయన వాళ్ల వైపు చూసి పిచ్చా.. వెర్రా.. అన్నట్లు హేళనగా నవ్వారట.  కేన్సర్‌ వంటి తీవ్ర వ్యాధులతో బాధపడే రోగులు నా దగ్గరకు చాలా మందే వస్తూ ఉంటారు లేదా ఫోన్‌ ద్వారా కూడా సంప్రదిస్తూ ఉంటారు. కానీ, నేనెప్పుడూ వారి కథలను రాసిపెట్టలేదు. ఇటువంటి వాళ్లందరికీ నేను సిరిధాన్యాలు + కషాయాలతో సులభమైన చికిత్సనే చేస్తున్నాను. ఈ చికిత్స చాలా మామూలు సంగతిగా అనిపిస్తున్నప్పటికీ ప్రభావశీలంగా పనిచేస్తున్నది. అందువల్ల, సిరిధాన్యాలు + కషాయాలతో కూడిన చికిత్స పద్ధతి ఆవశ్యకతను గురించి వివరంగా చెప్పుకోవటం అవసరం అనిపిస్తోంది.

కషాయాలను వాడటం అనేది మన ఇళ్లలో పూర్వం నుంచీ ఉన్నదే. ఎవరికి ఏ అనారోగ్యం కలిగినా బామ్మలు ఆయా లక్షణాలను బట్టి తగిన కషాయాలను సూచిస్తూ ఉంటారు. బామ్మలు సూచించే అటువంటి ఔషధాల గురించి నేను చాలా లోతుగా శాస్త్రీయ అధ్యయనాలు చేసి, నిర్థారణకు వచ్చిన తర్వాత రోగులకు సూచిస్తున్నాను.

ఔషధ గుణాలున్న సిరిధాన్యాలు ఐదు రకాలు. 

కొర్ర (Foxtail Millet) బియ్యం, ఊద(Barnyard Millet) బియ్యం, అరిక(kodo Millet) బియ్యం, సామ(Littile Millet) బియ్యం, అండు కొర్ర(Browntop Millet) బియ్యం. వ్యాధిని బట్టి, కేన్సర్‌ రకాన్ని బట్టి ఈ ఐదింటిలో ఎంపిక చేసిన రెండు రకాల చిరుధాన్యాలను తినాలి. వీటితో పాటు ఈ ఐదింటిలో ఇతర సిరిధాన్యాల బియ్యాన్ని కూడా తినవచ్చు.  కేన్సర్‌ను ఎదుర్కొనే క్రమంలో ప్రతి ఒక్కరూ వారానికి ఒకసారి నువ్వు లడ్డు తినాలి. లడ్డు తినటం వీలుకాకపోతే.. దోరగా ఇనుప పాత్రలో వేయించిన నువ్వులు అర చెంచాడు లేదా చెంచాడు, వారానికోసారి, తినాలి.


Subscribe to get more Posts :